గద్వాల సంస్థానము

వికీపీడియా నుండి

గద్వాల సంస్థానము తుంగభద్ర మరియు కృష్ణా నదుల మధ్య ప్రాంతములోని అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. 14వ శతాబ్దములో కాకతీయ సామ్రాజ్య పతనము తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సామ్రాజ్యము యొక్క సామంతులు అయినారు. వంశ చరిత్ర ప్రకారము గద్వాలను 1553 నుండి 1704 వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి మరియు కుమార వీరారెడ్డి పరిపాలించారు.

1650 ప్రాంతములో ముష్టిపల్లి వీరారెడ్డి అయిజా, దరూరు మొదలైన మహళ్లకు నాడగౌడుగా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానము లేకపోయడము వలన తన ఏకైక కుమార్తెకు వివాహము చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికము తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయినాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఈయననే సోమానాధ్రి, సోమన్నభూపాలుడని ప్రసిద్ధుడయ్యాడు). పెద్దారెడ్డి తరువాత ఆయన రెండవ కొడుకు సోమన్న 1704 నుండి నాడగౌడికము చేశాడు. ఈయనే కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణమున రాజ్యాన్ని బనగానపల్లె, ఆదోని, సిరివెళ్ల, నంద్యాల, సిద్ధాపురం, ఆత్మకూరు, అహోబిళం, కర్నూలు మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు.

నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలములో, దక్కన్లోని కొన్ని ప్రాంతములలో మరాఠుల ప్రాబల్యము పెరిగి 25 శాతము ఆదాయ పన్ను (చౌత్) వసూలు చేయడము ప్రారంభించారు. దీనిని దో-అమలీ (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ 1840 లో మరణించాడు. ఆ తరువాత ఆయన దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానమును పరిపాలించాడు. నిజాము VII ఈయనకు "మహారాజ" అనే పట్టమును ప్రధానము చేశాడు. 1924 లో మరణించే సమయానికి ఈయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు కలరు.