ఎమ్మెస్ రామారావు
వికీపీడియా నుండి
"సుందరదాసు" బిరుదాంకితుడు, తెలుగు చలన చిత్ర చరిత్ర లో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాసిల్దారు చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా "ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా" అనే ఎంకి పాట పాడించినాడు). గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన 'సుందరకాండము'(రామాయణం లోని ఒక భాగం) ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం.
జననం~: 3-7-1921
జన్మ స్థలం~: గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మోపర్రు గ్రామం
తల్లితండ్రులు~: మోపర్తి రంగయ్య-మంగమ్మ
విద్యాభ్యాసం~: నిడుబ్రోలు హైస్కూల్, గుంటూరు హిందూ కాలేజీ
వివాహం~: 1942 లో శ్రీమతి లక్ష్మీ సామ్రాజ్యం తో
సంతానం~: వెంకట సరోజిని, బాబూరావు, నాగేశ్వర రావు లు
1944 నుంచి 1964 వరకు సినీ నేపథ్య గాయకునిగా మద్రాసులో నివాసం
1964 నుంచి 1974 వరకు రాజమండ్రి లో నివాసం
1972 నుంచి 74 వరకు~:
1. తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువాదం.
2. తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ 'సుందరకాండ' గేయరచన.
1975 నుంచి హైదరాబాదు లో నివాసం.
ఎమ్మెస్ రామారావు తల్లిదండ్రులు సీతారాముల భక్తులు. చిన్నతనం నుండే ఆయన పాటలు పాడుతుండే వాడు. ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941 లో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు. జడ్జిలలో ఒకరైన అడివి బాపిరాజు చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను చాలా ప్రోత్సహించాడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై. వి. రావు తన తాసిల్దారు చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా "ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా" అనే ఎంకి పాట పాడించినాడు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సిహెచ్. నారాయణరావుకు ఇది ప్లే బాక్. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. 1944 నుంచి 64 వరకు తెలుగు చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా మద్రాసు లో నివసించిన ఆయన 5 సంవత్సరాల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు.కొన్ని పాటలు వ్రాసి గ్రామ్ ఫోన్ రికార్డులు ఇచ్చాడు~: నల్లపిల్ల, తాజ్ మహల్, హంపి, కనీసం, హిమాలయాలకు రాలేనయ్యా, మొ||
1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకున్నాడు. అక్కడ నవభారతి గురుకులంలో ఉద్యోగంలో చేరి 10 సం.లు ఉన్నాడు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు ఇండియన్ ఏర్ ఫోర్స్(IAF) లో పైలట్ ఆఫీసరు గా నియమితుడైనాడు. 1971లో పాకిస్థాను తో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు.తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ.