అక్షరధామ్

వికీపీడియా నుండి

అక్షరధామ్-స్మారక భవన సముదాయం
అక్షరధామ్-స్మారక భవన సముదాయం


విషయ సూచిక

[మార్చు] అక్షరధామ్

మన దేశ రాజధాని న్యూఢిల్లీ లో దాదాపు వంద ఎకరాల విశాల భూభాగంలో నిర్మితమైన అక్షరధామ్ 2005 నవంబర్ 7వ తేదీన రాష్ట్రపతి కలామ్ చేత ఆవిష్కృతమై, 8వ తేదీ నుంచి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరవబడిన ఆ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో 'నొయిడా క్రాసింగ్ ' వద్ద యమునా నది తీరాన మహొన్నంతంగా వెలసి, పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతీ వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది. ఇది ఆలయం కాదు ఒక గొప్ప స్మారక భవన సముదాయం. ఇది ఒక విద్యా ప్రభోధ కేంద్రం, అనుభవం, జ్ఞాన ప్రకాశ నిలయం. సంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతీ నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మంకంగా మేళవించిన తీరుకది ప్రతీక.

అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో , ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు " స్వామి నారాయణ్ అక్షరధామ్ " .

[మార్చు] నిర్మాణ కళాశైలి

అక్షరధామ్-నిర్మాణ కళాశైలి
అక్షరధామ్-నిర్మాణ కళాశైలి

రాజస్తాన్ ‍లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి సేకరించిబడిన వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు , పాలరాళ్ళతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం. గుజరాత్ ‍కు చెందిన గాంధీనగరలో దేశంలో మొదటిదైన అక్షరధామ్ వెలిస్తే, ఢిల్లీలోని అక్షరధామ్ రెండవది. బదరీనాథ్, కేదార్‍నాథ్, సోమనాథ్, కోణార్క్ ఆలయాల భవన నిర్మాణ కళాశైలి ఈ స్మారక భవన నిర్మాణానికి స్పూర్తి. వైదిక స్థపత్య శాస్త్రాల (భవన నిర్మాణ కళకు సంబంధించిన) నిబంధనలమేరకే రూపొందించిబడి, మలచడం దాని విశిష్టత.

వంద ఎకరాల భూభాగం హృదయస్థానంలో భక్తిద్వార్, మయూర్ ద్వార్ అనే రెండు పెద్ద గేట్ల రక్షణతో బృహత్ సౌధంలా విరాజిల్లుతుంటుంది. అక్షరధామ్ స్మారక భవనం, పలు గుమ్మటాలతో, 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో, 370 అడుగుల నిడివితో చూపరులను ఆ భవనం దిగ్ర్భాంతికి లోనుచేస్తుంది.

ఎర్రటి ఇసుకరాళ్ళతో నిర్మించబడి, 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల ' పరిక్రమ ' స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టివుంటుంది. దాని నిడివి దాదాపు రెండు కిలోమీటర్లు. 145 కిటికీలతో , 154 శిఖరాలతో అది అలరారుతుంటుంది.

[మార్చు] గజారూఢ భవనం

అక్షరధామ్-శిల్ప శోభ
అక్షరధామ్-శిల్ప శోభ

స్మారక భవన రూపం విషయానికొస్తే అహ్మదాబాద్ వాస్తు శిల్పి వీరేంద్ర త్రివేది రూపొందించిన ఆ కట్టడాన్ని 148 రాతి ఏనుగులు తమ భుజాలపై మోస్తుంటాయి. ఆ 148 ఏనుగులు భారత పురాణాలు, పంచతంత్రకు చెందిన గాథలకు ప్రతిరూపాలు, కాంగ్రా చిత్తరువులు, 20,000 దేవతా విగ్రహాలు, పురాణేతిహాసాల కథలు, గాథలతో చిత్రీకరించబడిన ప్రతి చదరపు అంగుళం, కళాత్మకంగా కనువిందు చెస్తాయి. భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది.

కెంపు రంగులో వున్న ప్రహరీ గోడలు చాలా ఎత్తైనవి. దాటరానివి, ఆ బృహన్నందిర నిర్మాణానికి రాళ్ళెత్తిన వారి సంఖ్య 11,000 అయితే, వ్యయం దాదాపు రెండువందల కోట్లు. ప్రపంచమంతటా విస్తరించివున్న స్వామి నారాయణ్ అనుయాయుల నుంచి లభించిన విరాళాలే అందుకుపకరించాయంటే దాని వైభవం, విస్తృతి, శిల్ప శోభ ఎంత మహొన్నతమైనవో ఊహాతీతం.

[మార్చు] యజ్ఞపురుష్ ‍కుండ్

అక్షరధామ్-రంగురంగుల కాంతులు
అక్షరధామ్-రంగురంగుల కాంతులు

ప్రధాన మందిరం పక్కనే " యజ్ఞపురుష్ ‍కుండ్ " అనే జలాశయం తారసపడుతుంది. మతాచార కర్మకాండ నిమిత్తం ఆ జలాశయంలో 2870 మెట్లుంటాయి. రాతి మెట్ల దిగుడు బావి వంటి ఈ తటాకంలో వేదోక్తమయిన యజ్ఞకుండం కూడ ఏర్పాటైవుంది. దాని నడుమ రంగు రంగులుగా వుండి సంగీత స్వరాలు ప్రతిధ్వనించే నీటి ఊట ఆనందకారం. ఆ కాసారమేగాక స్మారకభవన సముదాయంలో ఆకర్షణీయమైన స్థావరాలు మరికొన్ని వున్నాయి. అందులో ' నారాయణ్ సరోవర్' ఒకటి. స్వామి నారాయణులవారు క్రుంగు విడినవిగా భావించబడిన 151 పుణ్యనదీజలాలు ఈ సరోవరంలో నిక్షిప్తమై వున్నాయని ప్రతీతి.

[మార్చు] భారత్ ఉపవన్

ఇది ఒక సుందరమైన ఉద్యానవనం. దీనిలో ఇంచుమించు 9,00,000 పొదలు, మొక్కలు నాటబడి వున్నాయి. ఫౌంటెయిన్‍లు, జాతీయ నాయకుల, ఋషుల ఇత్తడి విగ్రహాలతో అలలారుతూ ఈ వనం ధ్యాన ప్రదేశంగా ఉపయోగించబడుతోంది.

[మార్చు] సినిమా ప్రదర్శనశాలలు

సినిమా ప్రదర్శనశాలల్లో అత్యాధునికమైనది ' ఐమాక్స్ ' భవన సముదాయంలోని మూడు ప్రదర్శనశాలల్లో ఒకటైన ' నీలకంఠ్ దర్శన్ 'లో ఈ ' ఐమాక్స్ ' ధియేటర్ నెలకొల్పబడివుంది. ఈ ధియేటర్‍లో స్వామి నారాయణ్ 11 ఏళ్ళ బాలయోగి బాల్యం 45 నిమిషాల సిన్మాగా అవిష్కృతమౌతుంది. దాని పేరు ' మిస్టిక్ ఇండియా- యాన్ ఇన్‍క్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఇన్‍స్పిరేషన్ ". ఆ చిత్రానికి దర్శకుడు హాలీవుడ్‍కు చెందినటువంటి కెయిత్ మెల్ట్‍న్. బాలయోగినుంచి ఒక మతశాఖకు వ్యవస్థాపకుడిగా స్వామి నారాయణ్ ఎదిగిన తీరుకది చిత్రణ. మానససరోవర శోభ, ఆహారం కోసం మృగరాజు తపన, కొండకోనల మీదుగా విమాన విహారాలు- ఆయౌగి ప్రస్థానంలో తారసపడే ఈ దృశ్యాలన్నీ సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి.

ఈ సినిమా విశేషమేమంటే అందులో 45,000 మంది కళాకారులు పాల్గొనడమేగాక, అది 108 యాత్రా కేంద్రాలలో చిత్రీకరించబడడం, జనవరి 2005 సంవత్సరంలో ప్యారిస్ నగరంలో నిర్వహించబడిన పదవ అంతర్జాతీయ లార్జ్‍ఫార్మాట్ ఫిలిం ఫెస్టివల్ ( విస్తృత పరిమాణంలో చిత్రాల ప్రదర్శనోత్సవం) లో ప్రేక్షకుల ఎంపిక ' పురస్కారాన్ని గెలుచుకోవడంకూడా ఆ చిత్రం ప్రత్యేకతే.

[మార్చు] సహజానంద దర్శన్

రెండు తటాకాల చూట్టూన్మించబడిన ఈ మూడు ప్రదర్శనశాలల్లో రెండవది ' సహజానంద దర్శన్ ' . సజీవ భ్రాంతి కలిగించేటటువంటి మట్టి ప్రతిమలతో , చాకచక్యంగా వెలుగు శబ్దాల వినియోగంతో, స్వామి నారాయణ్ భగవాన్ జీవితాన్ని అక్కడి ప్రదర్శన అవిష్కరిస్తుంది. అందుకుగాను పదిహేను త్రీడైమెన్ష్‍న్ డయోరమాలు ( వర్ణ చిత్ర ప్రదర్శన యంత్రాలు) ఉపయోగించబడుతున్నాయి. పెద్ద సెట్టింగులు, శిల్పాలు, రోబోటిక్స్, పైబర్ ఆప్టిక్స్ వంటి సంకేతిక శబ్ద సాధనాలు, సంభాషణలు, సంగీతం కూడా నియోగించబడడంతో ప్రేక్షకుల కనులముందు 18వ శతాబ్ద వాతావరణం పునఃసృష్టించబడుతుంది.

[మార్చు] సంస్కృతి విహార్

మూడవ ప్రదర్శనశాల " సంస్కృతి విహార్ " భూగర్బంలో ఏర్పాటైన ఒక కృత్రిమ నదిలో ఒక పడవలో మీరు ప్రయాణించవలసివుంటుంది. ఆ పడవ షికారు ద్వారా పదివేల సంవత్సరాల భారతీయ సంస్కృతీ నాగరికతలు మీకు ఆనదీ తీరాన పరిచయమవుతాయి. పన్నెండు నిమిషాల పాటు సాగే ఆ శ్రవ్య-దృశ్య ప్రదర్శన మిమ్మల్ని ఊహాలోకంలోకి తీసుకువెళ్తుంది. అంత సుదీర్ఘకాలంలో మనదేశంలో కొనసాగిన ఆధ్యాత్మిక, శాస్ర్తీయ, చారిత్రక పరిశోధనలు, పరిణామాలను మీరు దర్శించడమేగాక ఆనాటి ఋషి శాస్త్రజ్ఞుల పరిశోధనా పలితాలు మీకు సుగ్రాహ్యమవుతాయి. అజంతా-ఎల్లోరా శిల్పాల నమూనాలతో బాటు ప్రపంచపు ప్రప్రధమ విశ్వవిద్యాలయమైన తక్షశిలకూడా మీకు అక్కడి శ్రవ్య-దృశ్య ప్రదర్శన ద్వారా దృగ్గోచరమవుతుంది.

[మార్చు] స్వామి నారాయణ్

అక్షరధామ్-స్వామి నారాయణ్
అక్షరధామ్-స్వామి నారాయణ్

ఉత్తరప్రదేశ్‍లోని అయోధ్యకు సమీపంలో వున్న ఛాపయ్యా గ్రామంలో 1781 లో ఆయన జన్మించాడు. ఏడవ ఏటనే పవిత్ర గ్రంథాల్ని పఠించి వాటి సారాన్ని గ్రహించాడు. నాలుగేళ్ళ తర్వాత ఆధ్యాత్మిక యాత్రీకుడిగా ఇల్లు వదిలి వెళ్ళాడు. ఏడేళ్ళ పాటు కాలినడకన భారతదేశమంతా సంచరించి, వివిధ సంస్కృతీ రూపాల్ని ఆకళింపుజేసుకుని, చివరకు గుజరాత్‍లో స్థిరపడ్డాడు. సాంఘీక- ఆధ్యాత్మిక విప్లవానికి నాందిపలికి ' స్వామి నారాయణ సంప్రదాయానికి వ్యవస్థాపకుడయ్యాడు. లక్షలాది జనులు ఆ సంప్రదాయానికి అనుయాయులయ్యారు. ఆ తర్వాత నలబైతొమ్మిదేళ్ళు ఈ భూమ్మీద జీవించి, తన వారసుల దీక్షవ్వారా, తన బోధనల ప్రాచుర్యం ద్వారా, తాను అమలుపరచిన సంప్రదాయం ' అక్షరం' (వినాశనం లేనిది) గా కొనసాగే మార్గం సుగమం చేశాడు. అందుకే ఆ భవనసముదాయం ' అక్షరధామ్ ' గా ప్రసిద్ధిపొందింది. అదెలాగ సంభవమైందీ అంటే, ఆ సంప్రదాయానికి చెందిన బ్రహ్మ స్వరూప్ యోగీజి మహారాజ్ 1968 లో ఒక కోరిక వెలిబుచ్చాడు. యమునాతీరాన ఒక స్మారక భవనం నిర్మించబడాలన్నదే ఆ అకాంక్ష. అయినా ఆయన జీవితకాలంలో అది జరగలేదు. ఆయన వారసుడు " బొచాసన్‍వాసి శ్రీ అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బ్యాప్స్) కు ఆధ్యాత్మిక గురువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ (83) ద్వారా ఆ కోరిక నెరవేరింది. కేవలం ఆయన చొరవతో, ఆశీస్సులతో రెండు దశాబ్దాల కృషి ఫలితంగా నేటి " స్వామి నారాయణ్ అక్షరధామ్ ' వెలిసింది. ఆ బ్యాప్స్ సంస్థ ఢిల్లీలోనే కాదు విశ్వవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలలో అలాంటి స్మారకభవన సమూదాయాలను 600 లకు పైగా నిర్మించింది. ప్రముఖ్ స్వామి ఆధ్వర్యంలో 200 కోట్ల వ్యయంతో , 11,000 మందికి మించిన పనివారితో 7000 వాలంటీర్లు రాత్రింబవళ్ళు శ్రమించి, అయిదేళ్ళలో ఆ సాంస్కృతిక విద్యా ప్రబోధ, వినోద కేంద్రం నిర్మించారు. ఆ నిర్మాణం ఎంత దృడమైందంటే, ఎలాంటి భూకంపాలనైనా తట్టుకొని, వెయ్యి సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా మనగలదు. ఇంత పరమాద్భుతమయిన స్వామి నారాయణ్ అక్షరధామ్ యుగయుగాలుగా పరిఢవిల్లుతోన్న భారతీయ సంస్కృతీ, ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ సంస్కృతి సౌందర్యాన్ని, దానిలో నిక్షిప్తమైవున్న అపారవిజ్ఞానం, పరమానందాలను ఆ భవనసందర్శనం ద్వారా మనం ఆకళించుకోగలుగుతాము. ప్రాచీన భవన నిర్మాణ శిల్ప సంప్రదాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మిళితమై నయన మనోరంజకత్వం కల్పిస్తుంది.