తిక్కవరపు పఠాభిరామిరెడ్డి

వికీపీడియా నుండి

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి
తిక్కవరపు పఠాభిరామిరెడ్డి

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. పఠాభిగా ఆయన ప్రసిద్ధుడు. ఫిడేలు రాగాల డజన్‌, పఠాభి పన్‌చాంగంఅనేవి ఆయన ప్రసిద్ధ రచనలు. ఆయన తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం సినిమాలు నిర్మించాడు. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన సంస్కార చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. చండ మారుత, శృంగార మాస, దేవర కాడు అనే కన్నడ సినిమాలను నిర్మించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేసాడు.

విషయ సూచిక

[మార్చు] జీవిత విశేషాలు

పఠాభి - స్నేహలత
పఠాభి - స్నేహలత

పఠాభి 1919 ఫిబ్రవరి 2నెల్లూరులో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. మహాత్మాగాంధీ వారి ఇంటికి వచ్చినపుడు, ఆయన స్ఫూర్తితో అంతా స్వాతంత్య్ర సమరంలోకి దూకారు. ఠాగూర్‌ స్ఫూర్తితో పఠాభి శాంతినికేతన్‌కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. 1938లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు గూడూరులో కుటుంబ వ్యాపారమైన అభ్రకం ఎగుమతి వ్యాపారం చేసాడు. తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ఫిడేలు రాగాల డజన్‌ రచించాడు. తెలుగు ఆధునిక కవిత్వంలో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో చేరాలని అమెరికా బలవంతపెట్టింది. బ్రిటిష్‌వాళ్లు భారతీయుల్ని జైళ్లలో నెట్టినందుకు నిరసనగా సైన్యంలో చేరేందుకు నిరాకరించారు. సాహసోపేత యాత్రతో అమెరికా వదిలి దక్షిణ అమెరికా, ఆఫ్రికాల మీదుగా నౌకలో భారత్‌ చేరుకున్నాడు.

పఠాభి కుటుంబ సభ్యులు
పఠాభి కుటుంబ సభ్యులు

దేశంలో అడుగుపెట్టాక 1947లో స్నేహలతా పావెల్‌ అనే స్పానిష్‌ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. ఆమె కోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయనొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. వీరికి ఇద్దరు సంతానము. కుమారుడు కోనార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనారెడ్డి కార్మిక న్యాయవాది, సామజిక సేవ కార్యకర్త

కె.వి.రెడ్డితో కలిసి జయంతి పిక్చర్స్‌ను స్థాపించి తెలుగు చిత్రాలు తీశారు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అవార్డు దక్కించుకుంది. 1971లో సంస్కార చిత్రం రాష్ట్రపతి నుంచి స్వర్ణకమలం అందుకుంది. ఈ సినిమాలో ఆయన భార్య స్నేహలత కథానాయిక. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం అనుభవించి, అనారోగ్యంతో స్నేహలత 1977లో మరణించింది.

87 ఏళ్ళ వయసులో 2006 మే 6న పఠాభి బెంగుళూరులో మరణించాడు.

[మార్చు] పఠాభి గురించి

  • "పఠాభి పంచాంగంలోని పసిడి పలుకుల విటమిన్‌-బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకి ఆరోగ్యము, ఉల్లాసము సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను. ఏ సిద్ధ మకరధ్వజానికి, వసంత కుసుమాకరానికీ లేని పునరుజ్జీవన శక్తి ఈ మాత్రలకుంది." అని మహాకవి శ్రీశ్రీ ఆయనకు కితాబిచ్చాడు.

[మార్చు] సినిమాలు

  • సంస్కార (1970)
  • ఒక ఊరికథ (1977)
  • చండమారుత (1977)
  • శృంగార మాస (1984)
  • దేవర కాడు (1993)
  • పెళ్లినాటి ప్రమాణాలు
  • శ్రీకృష్ణార్జున యుద్ధం
  • భాగ్యచక్రం

[మార్చు] మూలాలు, వనరులు

  1. ఈనాడు
  2. హిందూ పత్రిక

[మార్చు] బయటి లింకులు

  1. హిందూలో వ్యాసం
  2. ఈమాట నివాళి
  3. భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్
  4. మా లిఖ
ఇతర భాషలు