పొట్టి శ్రీరాములు
వికీపీడియా నుండి
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు ఆయన. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం విలువ, సామవేదం జానకిరామ శర్మ వ్రాసిన ఈ క్రింది కవిత చదివితే అర్థమౌతుంది.
- అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
- దాన మిచ్చె ధధీచి మౌని యతడు
- యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
- శిబి చక్రవర్తి ప్రసిద్దుడతము
- అది యొక లెక్కయా?యడుగులు మూడుగా
- ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
- యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
- లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
- యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
- పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
- యక్కజంపడి తలయూచి యాడుభాష
- లందగించెను మేఘగర్జాంతముల
విషయ సూచిక |
[మార్చు] జీవిత విశేషాలు
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165 వ నుంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది నెల్లూరు జిల్లాలోని పటమటపల్లె గ్రామం. 20 వ ఏట వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. 25వ ఏట భార్య చనిపోయిన తరువాత, ఐహిక సుఖాలపై అనురక్తి తగ్గి, 1927లో ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1930లో ఉప్పు స్త్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.
గుజరాత్ రాష్ట్రంలోని రాజకోట్ లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలు లోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలు లో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే అయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు.
[మార్చు] ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచింది.
[మార్చు] మరణం
రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తూ ఉన్నా శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొదిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కొద్దికొదిగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లోఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతూండది. నిమిష నిమిషానికీ చొంగే కారుతూండది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసపోవడం... పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబరు ఐదో తేదీనాటకి ఎక్కిళ్లు,తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసంచారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయరసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపో యేవి. కొన్నికొన్ని సందర్భాల్లో నెత్తురు పడది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలని; మాట్లాడలని స్థితికి వచ్చారు. డిసెంబరు నెల కావడంతో విపరీతంగా చలిపెటది.దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలని సితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉద్ధృతం కావడం; ప్రభుత్వం స్పందించకపోవడం; ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓరోజు బులుసు సాంబమూర్తి, నరసింహలతో మాట్లా డారు. క్రమక్రమంగా దేహం బలహనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెకను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు.
ఆఖరు రోజు
డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు!! ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచవారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందు కు కూడా శక్తి లేదు. 54 పౌనుల బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడ్ట ప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపవశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణతో మాట్లాడలకపోయినా... చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పట్ణి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం బలిదానం చేశారు.
[మార్చు] పొట్టి శ్రీరాములు ప్రశంస
- పొట్టి శ్రీరాములు కార్యదీక్షను చూసి గాంధీజీ ఇలా అన్నాడు: "శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధీంచవచ్చు"
- మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డు లో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది.
[మార్చు] మూలాలు, వనరులు
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి రచించిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు